ప్రగతి నగర్‌లో ఈనెల 19న భారీ 'హిందూ సమ్మేళన సభ'

హైదరాబాద్, వార్తానిధి: ప్రగతి నగర్‌లోని వాసవి లేఅవుట్ జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో ఈనెల 19వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు భారీ 'హిందూ సమ్మేళన సభ'ను నిర్వహిస్తున్నట్లు హిందూ సమ్మేళన సమితి ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు హిందూ సమాజంలో ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సమితి అధ్యక్షులు దొడ్డ పవన్, కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి, ఇతర బాధ్యులు వెల్లడించారు. ఈ మేరకు సభకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని వారు పేర్కొన్నారు.

​ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా విద్యారణ్యం వేదపాఠశాల వ్యవస్థాపకులు మాడుగుల శశిభూషణ సోమయాజి గురూజీ, సేవాభారతి తెలంగాణ ప్రాంత సంఘటనా మంత్రి వాసు, డాక్టర్ భువనేశ్వరీ మారేపల్లి హాజరుకానున్నారు. కార్యక్రమంలో భాగంగా గోపూజ, భరతమాత పూజ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు దేశభక్తి గీతాల ఆలాపన, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ముఖ్య వక్తలు ధార్మిక అంశాలపై, సమాజ ఐక్యత ఆవశ్యకతపై సందేశాలను అందించనున్నారు.

​సమాజంలోని హిందువులందరినీ ఏకం చేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ సభను విజయవంతం చేయాలని ఆర్గనైజింగ్ సెక్రటరీ భారతీజైన్, ఉప్పాల వంశీగుప్తా, స్వాగత కమిటీ సభ్యులు కోరారు. ఆదివారం సాయంత్రం జరగనున్న ఈ ధార్మిక వేడుకకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంస్కృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నరేంద్ర చౌదరి, నీతా, సంతోష్, సాత్విక్ తదితరులున్నారు.

Post a Comment

Previous Post Next Post